కరోనా కష్టాలు : ఓలా ఏం చేసిందంటే...

ముంబై : లాక్ డౌన్ కష్టాలనుంచి తమ ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా నడుం బిగించింది. కరోనా (కోవిడ్-19) వైరస్ వ్యాప్తి, లాక్  డౌన్ ఇబ్బందుల్లో పడిన  లక్షలమంది డ్రైవర్లను ఆదుకునేందుకు  ముందుకు వచ్చింది. నిరుద్యోగులుగా మిగిలిపోయిన డ్రైవర్లకు, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాలకోసం  రూ. 20 కోట్లతో ‘డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్’ పేరుతో ఒక నిధిని ప్రారంభిస్తున్నామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. స్వయంగా తన వార్షిక జీతాన్ని ఈ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. దాతలందించే  ప్రతీ చిన్న సహకారం మిలియన్ల కుటుంబాల శ్రేయస్సుపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందనీ, ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ  క్రౌడ్ ఫండింగ్ ద్వారామొత్తం రూ .50 కోట్లు సేకరించాలని కంపెనీ ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.